
DET:OCT 15:
కళాకారులకు ‘కళైమామణి’ పురస్కారాలు: సాయి పల్లవి, అనిరుధ్, ఎస్.జె. సూర్య మెరుపులు:
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కళైమామణి’ పురస్కారాలను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రదానం చేసింది. కళ, సాహిత్యం, నాటకం, సినిమా వంటి రంగాలలో విశేష కృషి చేసిన కళాకారులకు ఈ గౌరవం లభించింది. ఈ పురస్కారాల ప్రధానోత్సవ వేడుక చెన్నైలోని కళైవాణర్ అరంగంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కార ప్రదానం:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, 2021, 2022, మరియు 2023 సంవత్సరాలకు గాను మొత్తం 90 మందికి పైగా కళాకారులకు ‘కళైమామణి’ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సినిమా ప్రముఖులకు అరుదైన గౌరవం:
ఈ పురస్కార గ్రహీతల్లో సినీ రంగానికి చెందిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి సాయి పల్లవి 2021 సంవత్సరానికి, నటుడు ఎస్.జె. సూర్య 2021 సంవత్సరానికి, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ 2023 సంవత్సరానికి మరియు నటులు విక్రమ్ ప్రభు, మణి కందన్, జార్జ్ మరియన్ వంటి వారు ఉన్నారు. వీరందరూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా గౌరవ పురస్కారాలను అందుకున్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు:
పురస్కారాల ప్రదానానంతరం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ, కళాకారులందరినీ అభినందించారు. ఈ ‘కళైమామణి’ పురస్కారం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, కళల పట్ల వారి అంకితభావానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. బంగారు ధర రోజురోజుకూ మారుతున్నప్పటికీ, తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చే ‘కళైమామణి’ టైటిల్ విలువ మాత్రం ఎప్పటికీ తరగనిది, బంగారంతో పోలిస్తే ఇదే అమూల్యమని ఆయన ఉద్ఘాటించారు. 90 ఏళ్ల వయస్సున్న వృద్ధ కళాకారుల నుండి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ వరకు ఈ అవార్డులు అందుకోవడం తమ ప్రభుత్వ విధానానికి నిదర్శనమని తెలిపారు. కళలను, తమిళ భాషను, సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయాలని కళాకారులకు పిలుపునిచ్చారు.
