
DNews: Jan 06: సంగారెడ్డి మరియు సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తనను పిలవవద్దని, భవిష్యత్ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డిని ప్రచారానికి ఆహ్వానించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం తన వద్దకు ఎవరూ రావద్దని స్పష్టం చేశారు. తాను ప్రచారానికి రాకపోయినా సంగారెడ్డి ప్రజలు తనపై నమ్మకం ఉంచుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీ విజయానికి ఇచ్చిన హామీలన్నింటినీ తాను నెరవేర్చుతానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తాను జీవితాంతం పోలీసులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసినప్పటికీ, ఎప్పుడూ పోలీసులను అడ్డుకోవడం ద్వారా రాజకీయాలు చేయలేదని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుకోవడం ద్వారా గెలవాలని ప్రయత్నించవద్దని నాయకులకు సూచించారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం గాంధీభవన్కి వెళ్లవద్దని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చే హామీలను తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నెరవేర్చుతానని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించే నాయకులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ను, వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ హఫీజ్ను ప్రకటించారు. చైర్మన్ పదవికి బీసీ, బీసీ మహిళలు, జనరల్ ఏ వర్గమైనా తాను కూన సంతోష్ను అభ్యర్థిగా నిలబెడతానని స్పష్టం చేశారు.
