
DNews : Dec 01: హైదరాబాద్ నగరంలో లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (JP) మాట్లాడుతూ దేశంలో ఉన్న డిగ్రీలలో 90 శాతం కాగితపు ముక్కలతో సమానం, ఉపయోగం లేనివని అన్నారు. నైపుణ్యాలను అందించని డిగ్రీలు దృష్టిని ఆకర్షించడానికీ పనికిరావని, సమాజ అభివృద్ధికి అవసరమయ్యేది డిగ్రీలు కాదు, సృజనాత్మకత, ఉత్పత్తి సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు కావాలని స్పష్టం చేశారు. దేశంలో 24 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ, వారిలో 80 శాతం భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ అంతా ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లు, కోర్టు కేసులకే పరిమితమైందా అని ప్రశ్నించారు. పిల్లల పేరుతో దేశంలో ఒక నాటకం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం లక్ష రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నా కనీస విద్యా ప్రమాణాలు చేరుకోవడం లేదని, పాఠశాలల్లో పరీక్షలు కేవలం నిర్వహణ కోసం జరుగుతున్నాయని విమర్శించారు. అనేక అధ్యయనాలు చూపినట్లుగా, ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 20 శాతం మందికి కూడా ప్రాథమిక జ్ఞానం లేకుండా, కాపీ కొట్టడం లేదా మోసం చేయడం ద్వారా మాత్రమే పాస్ అవుతున్నారని తెలిపారు.
గచ్చిబౌలిలోని ESCI ఆడిటోరియంలో ఆదివారం వదన్య ఎన్జీవో 15వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా మాట్లాడిన JP, ప్రభుత్వ ఉద్యోగమే అన్న భావనలో ఉన్నవారు మూర్ఖులని, పాలకులు తప్పుడు హామీలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న మోజు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. ఒక ఇంటి మరుగుదొడ్డిలో మలినాలను తొలగించే ప్లంబర్ జిల్లా కలెక్టర్ కంటే గొప్పవాడని గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేదలలో ప్రతిభావంతులను గుర్తించి వారికి విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్న వదన్య జనసమాజ సేవలు ప్రేరణాత్మకమని అన్నారు. వదన్య వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి మాట్లాడుతూ ఇప్పటివరకు వారి సంస్థ సేవలు పొందిన 100 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, వారిలో 50 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రసిద్ధ సినీ దర్శకుడు హను రాఘవపూడి, రచయిత బీవీఎస్ రవి వదన్యతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇంజనీర్ గాలి మాధవీలత పేదరికం కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న యువతను గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని అన్నారు. IFS అధికారి సువర్ణ సమాజ సేవలో తమ విలువైన సమయాన్ని అంకితం చేస్తున్న వదన్య వాలంటీర్లను అభినందించారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జి. రామేశ్వరరావు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
