
DNews: Jan 12: తెలంగాణ ప్రభుత్వ ఖర్చు తగ్గింపు చర్యలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై భారంగా మారిన ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో, ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకుని కొనసాగుతున్న ప్రభుత్వ శాఖలు తక్షణమే తమ స్వంత భవనాలకు మారాలని ఆదేశించింది. దీని ద్వారా సంవత్సరానికి సుమారు రూ.800 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంటర్నెట్ ఖర్చులు
ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, వీటికి సంవత్సరానికి సుమారు రూ.450 కోట్లు ఖర్చవుతోంది. SWAN (State Wide Area Network) ద్వారా 1,057 సంస్థలకు ఇంటర్నెట్ అందిస్తున్న కంపెనీకి సంవత్సరానికి రూ.38 కోట్లు చెల్లిస్తున్నారు. సచివాలయం ఒక్కటే సంవత్సరానికి రూ.8 కోట్లు ఇంటర్నెట్ ఖర్చు చేస్తోంది. అద్దె భవనాలపై రూ.800 కోట్లు, ఇంటర్నెట్పై రూ.450 కోట్లు—మొత్తం రూ.1,250 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చవుతున్నాయి.
T-Fiber వినియోగం
2020లో ప్రభుత్వం “తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్” (T-Fiber) ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చింది. ఇది భారత్నెట్ ఫేజ్-2లో భాగంగా ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ ఆధ్వర్యంలో ఉంది. అయితే ఇప్పటివరకు చాలా ప్రభుత్వ సంస్థలు దీన్ని వినియోగించలేదు.
GO MS No. 9 (డిసెంబర్ 8, 2024)
ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ/పబ్లిక్ సెక్టార్ సంస్థలు, పట్టణ/గ్రామీణ స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలు తప్పనిసరిగా T-Fiber ఇంటర్నెట్ వినియోగించాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రతి శాఖలో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,86,547 ప్రభుత్వ అనుబంధ సంస్థలు T-Fiber వినియోగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు 5% కూడా కనెక్షన్లు తీసుకోలేదు.
సైబర్ భద్రత
ప్రస్తుతం T-Fiber ఇంటర్నెట్ ప్రభుత్వ సంస్థలకు “వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్” (VPN) ద్వారా అందిస్తోంది. ఇది ప్రజలకు అందించే విధానానికి భిన్నంగా ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వ వెబ్సైట్లు, సేవలు సైబర్ దాడులకు గురికాకుండా రక్షణ పొందుతాయి. VPNలో ఎవరైనా చొరబడితే వెంటనే అలర్ట్ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే వినియోగిస్తున్న శాఖలు
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 28 పోలీస్ స్టేషన్లు, TS SPDCL, రైతు వేదికలు, స్ట్రీనిధి, SERP వంటి కొన్ని శాఖలు ఇప్పటికే T-Fiber వినియోగిస్తున్నాయి. అదేవిధంగా, పాఠశాల విద్యాశాఖకు చెందిన 10,000 పాఠశాలలు, MCRHRD కూడా కనెక్షన్లు కోరాయి.
గ్లోబల్ సమ్మిట్-2025లో T-Fiber పాత్ర
ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్-2025లో, ఫ్యూచర్ సిటీలో 2G సిగ్నల్స్ కూడా లేని ప్రాంతంలో T-Fiber 5G సిగ్నల్స్ అందించింది. సుమారు 10 గిగాబైట్ల నెట్ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 42,000 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ వైర్లను ఇప్పటికే వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందించడానికి సిద్ధంగా ఉంది.
