
D News: Jul 27: జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా జలాలు తెలంగాణ సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, ఆదివారం రాత్రి నాటికి జూరాల ప్రాజెక్టుకు 22,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. సోమవారం ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల జలాశయంలో 5.897 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీఎల్ఐ) ద్వారా సోమవారం నుంచి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ వెల్లడించారు. సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను నింపనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
