
DNational 23 Feb: రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో సోమవారం ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న సమయంలో, ముస్లిం మహిళలకు దుప్పట్లు ఇచ్చేందుకు మాజీ ఎంపీ, బీజేపీ నేత సుఖ్బీర్ సింగ్ జౌనపురియా నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
టోంక్ జిల్లాలోని ఒక గ్రామంలో జౌనపురియా వ్యక్తిగతంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వరుసలో ఉన్న మహిళలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న క్రమంలో, ముగ్గురు ముస్లిం మహిళల పేర్లు అడిగి తెలుసుకున్నారు. వారు తమ పేర్లు సుకరన్ ఖాన్, రజియా, జుబైదా అని చెప్పగానే, జౌనపురియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే వారి చేతికి ఇచ్చిన దుప్పట్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రధాని నరేంద్ర మోదీని దూషించే వారికి ఈ దుప్పట్లు పొందే హక్కు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వ పథకం కాదని, తన సొంత ఖర్చుతో చేస్తున్న పంపిణీ అని, ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే అధికారం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. స్థానికులు కొందరు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు టికారామ్ జుల్లీ మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఇలా మత ప్రాతిపదికన వివక్ష చూపడం సిగ్గుచేటని విమర్శించారు. పేదలకు సాయం చేసేటప్పుడు రాజకీయం చేయడం సరికాదని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
