
DNews: Nov 28: హైదరాబాద్ మెట్రో రైలు నగర ప్రజలకు వినోదాన్ని అందిస్తూ వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. 2017 నవంబర్ 28న ఘనంగా ప్రారంభమైన ఈ ప్రయాణం నిరంతర సేవతో ఇప్పటివరకు కొనసాగుతూ, నగర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. 2012లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో ఎల్బీ నగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలో 72 కిలోమీటర్ల నిర్మాణం రూ.14,132 కోట్ల వ్యయంతో చేపట్టబడింది. ఇందులో జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్ మాత్రమే మతపరమైన నిర్మాణాల కారణంగా పూర్తయింది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల పరిధిలో రైళ్లు నడుస్తూ, ఉదయం 6 గంటల నుండి రాత్రి 11.15 వరకు నిరంతర సేవలు అందిస్తున్నాయి.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.60 లక్షల నుండి 4.80 లక్షల వరకు ఉండగా, వీరిలో 51.5 శాతం మంది ఉద్యోగులు, 30.3 శాతం మంది వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి, 6.1 శాతం మంది విద్యార్థులు, 12.1 శాతం మంది స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లడానికి మెట్రోను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 80.21 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకున్నారు. ఎల్బీ నగర్–మియాపూర్, నాగోల్–రాయదుర్గం కారిడార్లలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం 57 స్టేషన్లు, రోజుకు 1,100 ట్రిప్పులు, 25,000 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతోంది. మెట్రో మరియు ఎల్&టీ ఇప్పటివరకు 205 అవార్డులు అందుకున్నాయి. రెండో దశలో 5 కారిడార్లు పార్ట్–Aలో, 3 కారిడార్లు పార్ట్–Bలో కలిపి మొత్తం 163 కిలోమీటర్ల విస్తరణకు రూ.43,848 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (DPRs) ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉండగా, 2026 మార్చి నాటికి ఆమోదం లభించే అవకాశం ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు లిమిటెడ్ (HAML) అధికారులు తెలిపారు. రెండో దశ అమలులోకి వస్తే మెట్రో నగరానికి మరింత ప్రతిష్టను తీసుకురానుంది.
