
DNews: Nov 25: హైదరాబాద్లోని రాజకీయ వాతావరణం ఎప్పుడూ ఉత్సాహభరితంగానే ఉంటుంది. పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు, చివరికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల వరకు నాయకుల మాటలతో హోరెత్తుతుంటాయి. ముఖ్యంగా GHMC కౌన్సిల్ సమావేశాలు చర్చల కంటే వాదోపవాదాలతోనే ఎక్కువగా సాగుతుంటాయి. ఈ పరిస్థితిపై నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కార్పొరేటర్లు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమె నేరుగా స్పందిస్తూ, సభ్యులు మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. ‘నువ్వు, నువ్వు, నువ్వు’ అనే విధంగా ఏకవచనంలో సంభాషించడం తగదని ప్రశ్నించారు.
మేయర్ మాట్లాడుతూ, కొత్తవారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఎవరికీ మైక్ ఇవ్వాలో తాను నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారని, అందరూ శాంతంగా ఉండి ఒక మంచి ఉదాహరణ చూపాలని సూచించారు. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని, పక్కవారు సూచనలు ఇవ్వకుండా ఉండాలని హెచ్చరించారు. కార్పొరేటర్లకు ఇచ్చే గౌరవాన్ని మేయర్కూ ఇవ్వాలని కూడా సూచించారు.
ఈ సందర్భంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ మధ్య మాటల యుద్ధం జరిగింది. హేమ మాట్లాడుతూ, మేయర్ తనకు కావలసిన గౌరవం ఇచ్చినట్లే కార్పొరేటర్లకు కూడా ఇవ్వాలని కోరారు. అంతేకాక, మేయర్ గతంలో వారిని “ఆఫ్-డ్యూటీ కార్పొరేటర్లు” అని సంబోధించిన విషయాన్ని గుర్తుచేశారు.
