
D News: Jul 11: రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జిల్లాలోని షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, మే 16న బాధిత బాలిక తల్లి రాజ్కుమార్పై పోక్సో కేసు నమోదు చేయించారు. అనంతరం బెయిల్పై విడుదలైన నిందితుడు కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు నిందితుడి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యలకు గల పూర్తి కారణాలు, ఇతర కోణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
హత్యల అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురిని హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తన తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
