
DNews: Apr16: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె నియోజకవర్గాల పునర్విభజన గురించి కీలకంగా ప్రస్తావించారు. కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు పెద్ద ముప్పు. దీనిని ఒక అత్యవసర పరిస్థితిగా గుర్తించి, తీవ్ర ఆందోళనతో, నియోజకవర్గాల పునర్విభజనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ 3 పేజీల బహిరంగ లేఖను రాస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ తన వాణిని కోల్పోవడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోతుంది. ఈ నేపథ్యంలో, నేను మిమ్మల్ని బలంగా, స్పష్టంగా కోరుతున్నాను. దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనను మీరు బహిరంగంగా, స్పష్టంగా వ్యతిరేకించాలి.
ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది లోక్సభ సభ్యులను, 11 మంది రాజ్యసభ సభ్యులను పార్టీ భేదాలకు అతీతంగా ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలి. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాకూడదు. ప్రజల హక్కులను పరిరక్షించడం రాజ్యాంగ బాధ్యత, భవిష్యత్ తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్య” అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు, తాను రాసిన లేఖను రాజకీయ కోణంలో చూడవద్దని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు నాయుడుకు సలహా ఇచ్చారు. ఇలాంటి కీలక సందర్భాల్లో మనం మౌనం వహిస్తే చరిత్ర క్షమించదని ఆమె పేర్కొంది.
