
D Spiritual: Dec 30: తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించడంతో నిన్న రాత్రి నుంచే భక్తులు తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లను ముందుగానే ఆన్లైన్ ద్వారా కేటాయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే నేడు తిరుమలలో దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
తిరుమలలో మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. భక్తులు తమకు కేటాయించిన సమయానికి అనుగుణంగా క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. క్రమశిక్షణ పాటించడం ద్వారా దర్శన ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు తిరుమలకు వీఐపీల రాక కూడా పెరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లారు.
వీఐపీ దర్శనాల్లో భాగంగా మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, సినీ నటుడు నారా రోహిత్ తదితరులు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు వీరికి శాస్త్రోక్తంగా తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈరోజు తిరుమలలో సర్వదర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కేవలం వైకుంఠ ద్వార దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని, ఎలాంటి ప్రత్యేక దర్శనాలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
నిన్న తిరుమల శ్రీవారిని మొత్తం 59,631 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 18,609 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.4.36 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ వెల్లడించింది.
