
DNews: Nov 28: అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డి తుపాకీ మిస్సింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎస్ఐ భానుప్రకాశ్ రెడ్డి ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా, విరుద్ధంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. తుపాకీ ఎక్కడ పెట్టారో గుర్తు లేదని ఆయన చెబుతున్నారని సమాచారం. ఐదు నెలల క్రితం ఆయన తుపాకీని కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రయాణంలో తన బ్యాగ్ ఎక్కడో పోయిందని చెప్పుకుంటూ వచ్చారు. అయితే, ఈ తుపాకీ మిస్సింగ్ విషయాన్ని ఆయన పై అధికారులకు ఐదు నెలల పాటు దాచిపెట్టినట్లు బయటపడింది. ఇటీవల ఆయన మరో ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ఎన్ఓసీ కోరినప్పుడు, సర్వీస్ రివాల్వర్ ఇవ్వాలని సూచించగా అసలు సమస్య వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఆయన తుపాకీ పోయిందని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అంబర్పేట్ పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు, భానుప్రకాశ్ రెడ్డి ప్రవర్తన పోలీస్ శాఖకు అవమానకరంగా మారిందని భావిస్తున్నారు. జూదాన్ని అరికట్టాల్సిన ఎస్ఐ, తానే అధికంగా బెట్టింగ్ చేసి లక్షల రూపాయలు కోల్పోయినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆయన తన స్వంత భూమిని కూడా అమ్మి బెట్టింగ్లో డబ్బు పెట్టినట్లు తెలిసింది. కడప జిల్లా రాయచోటిలోని భూమిని అమ్మి, రూ.96 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
