
D News: Jul 25: రాష్ట్రంలో రూ.71,602.60 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పలు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. డేటా సెంటర్లు, లిథియం అయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, సోలార్ ఇన్గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPC) పరిశీలించింది.
ఉత్తరాంధ్రలో ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లకు తోడు, విశాఖపట్టణంలో మరో భారీ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ఎల్ఎల్పీ రూ.58,743 కోట్ల పెట్టుబడితో లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో ఐదు దశల్లో పూర్తి చేయాలని సంస్థ భావిస్తుండగా, దీని ద్వారా 1,250 మందికి ఉపాధి లభించనుంది.
కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో 12 గిగావాట్ల సోలార్ ఇన్గాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపిన సంస్థ, ఇందుకోసం 156.96 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.
శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2,125 కోట్ల పెట్టుబడితో ఫాస్పారిక్ యాసిడ్, అనుబంధ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 400 మందికి ఉపాధి లభించనుండగా, 450 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ కోరింది. అలాగే నెల్లూరు జిల్లా మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసి సుమారు 2,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదించింది.
కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో ఏఐఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అదే విధంగా నెల్లూరు జిల్లాలో ప్రిసోల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.330.71 కోట్ల పెట్టుబడితో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసి 1,110 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.
ఈ పారిశ్రామిక ప్రతిపాదనలతో పాటు కొన్ని సంస్థలు అదనపు ప్రోత్సాహకాలు, గతంలో మంజూరైన అనుమతుల్లో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.
