
D News: Jul 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ వరకు ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు బోటింగ్ నిర్వహించేందుకు జలవనరులశాఖ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 25 షరతులతో ఎన్వోసీ జారీ చేసింది.
ప్రకాశం బ్యారేజీ నిర్వహణ, గేట్ల ఆపరేషన్, నీటి విడుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని జలవనరులశాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందస్తు సమాచారం లేకుండానే బోటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
బోటింగ్కు వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యత ఏపీటీడీసీదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ కార్యకలాపాల వల్ల మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని, పర్యాటకులు కృష్ణానదిలో చెత్త లేదా వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
బోటింగ్ సేవలు కేవలం పున్నమి ఘాట్–భవానీ ఐలాండ్ మధ్య మాత్రమే నిర్వహించాలని, ఆ పరిధిని దాటి బోట్లు వెళ్లకూడదని ఆదేశించింది. అధికారికంగా గుర్తించిన జెట్టీలను మాత్రమే వినియోగించాలని, ప్రకాశం బ్యారేజీకి వెయ్యి మీటర్ల ఎగువ ప్రాంతంలోకి బోట్లు ప్రవేశించరాదని స్పష్టం చేసింది. అలాగే బోట్లలో మద్యం, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాల రవాణాకు అనుమతి లేదని పేర్కొంది.
బోటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని చట్టబద్ధమైన అనుమతులను ఏపీటీడీసీ తప్పనిసరిగా పొందాలని జలవనరులశాఖ సూచించింది. ప్రతి బోటుకు కృష్ణానది రివర్ కన్జర్వేటర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలిపింది. అలాగే లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, కమ్యూనికేషన్ పరికరాలు, జీపీఎస్ వంటి సదుపాయాలు ప్రతి బోటులో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది.
బోట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా, తనిఖీ ధ్రువపత్రాలు సహా అన్ని పత్రాలు చెల్లుబాటులో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు ముగిసిన పత్రాలతో బోట్లను నడపరాదని, అనుమతించిన మార్గంలో తగిన లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో సురక్షిత బోటింగ్కు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది.
