
D Edct: Jul 22: తల్లికి వందనం పథకం 2026 తాజా అప్డేట్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద నేడు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఈ విడతలో మొత్తం రూ.10,120.78 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. వీరి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కానుంది. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.15,000 మంజూరు చేస్తుండగా, అందులో రూ.13,000 నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. మిగిలిన రూ.2,000 ఆయా విద్యార్థులు చదువుతున్న పాఠశాలల అభివృద్ధి నిధుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
ఈ ఏడాది ప్రభుత్వం రెండు విడతల్లో నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. రెండో విడతలో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం కల్పించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లో దశలవారీగా నిధులు జమ కానున్నాయి.
తల్లికి వందనం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకం కింద మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ bm.sgsw.ap.gov.in ను ఓపెన్ చేయాలి. హోమ్పేజీలో Status Check ఆప్షన్ను ఎంచుకుని, Scheme Typeలో Thalliki Vandanam ను సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత లబ్ధిదారుడి ఆధార్ నంబర్ నమోదు చేసి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన OTPతో పాటు క్యాప్చా కోడ్ నమోదు చేయాలి. అనంతరం స్క్రీన్పై Payment Status కనిపిస్తుంది. అక్కడ “Success” లేదా “Payment Released” అని ఉంటే డబ్బులు మీ ఖాతాలో జమ అయినట్లు అర్థం.
ఒకవేళ “Pending” లేదా “Inactive NPCI” అని చూపిస్తే, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లేదా NPCI మ్యాపింగ్ పూర్తికాలేదని అర్థం. అలాంటి సందర్భాల్లో సంబంధిత బ్యాంకు లేదా అధికారులను సంప్రదించి వివరాలు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
