
D Spiritual: Apr 30: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతీ నెల చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెల చివరి రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత దర్శనాన్ని అందిస్తున్నారు. ఈ రోజు కూడా చెంచు భక్తులు శ్రీస్వామివారిని ఉచితంగా స్పర్శదర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
ఉదయం చెంచు గిరిజన భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలు వాయిస్తూ, చెంచు నృత్యాలతో ఆలయానికి చేరుకున్నారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికారు. చెంచు గిరిజన భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి సహకారం అందించారు.
