
D News: Jul 14: ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థులు ఉచితంగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులోని వివరాలను కూడా ఎలాంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రత్యేక శిబిరాలు రెండు విడతల్లో నిర్వహించబడతాయి. తొలి విడత ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు, రెండో విడత 21 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ పాఠశాలల్లోనే బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవడంతో పాటు, కొత్త ఆధార్ కార్డు కోసం కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ వివరాలను సరిచేయించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.
ఆధార్ వివరాలు సక్రమంగా ఉండటం వల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం, అపార్ (APAAR) ఐడీ నమోదు, ఇతర గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియలు సులభంగా పూర్తవుతాయి. అలాగే ఆధార్లోని పేరు, జనన తేదీ వంటి వివరాలు జనన ధ్రువీకరణ పత్రంలోని వివరాలతో సరిపోలేలా చూసుకోవడం అవసరం.
ఈ శిబిరాల ద్వారా విద్యార్థులు ఆధార్ అప్డేట్ కోసం పట్టణాలు లేదా నగరాల్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. తమ గ్రామంలోని పాఠశాలలోనే సులభంగా ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.
ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కొత్త ఆధార్ కోసం నమోదు చేసుకోవాలంటే జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరం. పేరు, జనన తేదీ లేదా ఇతర వివరాల్లో మార్పులు చేయాలంటే జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో లేదా చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
చిన్న వయస్సులో ఆధార్ పొందిన పిల్లల బయోమెట్రిక్ వివరాలు వయస్సు పెరిగేకొద్దీ మారే అవకాశం ఉండటంతో వాటిని సకాలంలో అప్డేట్ చేసుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించినప్పటికీ, ఇంకా చాలామంది విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోలేదని అధికారులు తెలిపారు.
