
DNews: Jan 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవిర్యాల ఈ-సిటీ, మహేశ్వరం మండలంలోని సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా? నీళ్లు కావాలా? నాకు నీళ్లు కావాలి. వివాదం కావాలా? పరిష్కారం కావాలా? నాకు పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారాలు వివాదాల కంటే మిన్న” అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నదీ జలాల వివాదం
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్యలపై మాట్లాడుతూ, కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. సంయుక్త రాష్ట్రంలోనే పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆమోదాలు లభించాయని, ఇప్పుడు వాటిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అడ్డంకుల వల్ల పర్యావరణ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ సమస్యలు సృష్టిస్తున్నాయని, కేంద్రం నుంచి రుణాలు, నిధులు రాకపోవడం వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారమవుతోందని వివరించారు. “మేము రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ పది అడుగులు ముందుకు వేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
పోర్ట్ కనెక్టివిటీ అవసరం
తెలంగాణకు సముద్ర తీర కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య అని సీఎం రేవంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని, మచిలీపట్నం పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 12 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే, సమాంతర రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సహకారం కోరుతున్నామని చెప్పారు. ఈ కనెక్టివిటీ రెండు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని, పొరుగు రాష్ట్రాలతో ‘గివ్ అండ్ టేక్’ ధోరణి అవసరమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అమరావతికి కూడా ఉపయోగపడుతుందని, డేటా సెంటర్ల ఏర్పాటుకు నీరు, విద్యుత్ అవసరమని, కృష్ణా నీటిని పంచుకోవడంలో పరస్పర సహకారం అవసరమని వివరించారు.
పరిశ్రమలు, పెట్టుబడులు
ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారుతుందని, అక్కడ భూముల ధరలు అనేక రెట్లు పెరుగుతాయని, ఎవరూ తమ భూములను అమ్మకూడదని సీఎం సూచించారు. పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
విద్యా రంగంలో కొత్త విధానం
పరిశ్రమ, విద్యుత్, పర్యాటక, వైద్య రంగాల్లో ఇప్పటికే విధానాలు తీసుకొచ్చామని, త్వరలో విద్యా రంగంలో కొత్త విధానాన్ని ప్రకటించనున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పారదర్శక ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
ఉద్యోగాలు, ప్రైవేట్ రంగం
“ప్రైవేట్ రంగంలో జీతాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో అవకాశాలను వెతకాలి. ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మల్లరెడ్డి రంగారెడ్డి, కాళే యాదయ్య, టీజీఐఐసీ ఎండీ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
