
DNews: Nov 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో జరిగిన పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోంది అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దిశగా దేశాన్ని 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాదు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని పేర్కొంటూ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, గోదావరి నీటి మళ్లింపు, మూసీ నది శుద్ధి వంటి అభివృద్ధి పనులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి వచ్చే ఏడాది 3,000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ దిశగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడవ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా కలిగి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధితో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నగరాలతో పోటీ కాకుండా సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ చేయాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) మధ్య ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (IDEA) ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ అకాడమీ ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధునాతన డిజిటల్ హబ్గా మారనుంది. టెక్నాలజీ ఆధారంగా నాణ్యమైన విద్య అందించేందుకు యూనివర్సిటీ సిద్ధమవుతోంది. విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా, వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో COL అధ్యక్షుడు పీటర్ స్కాట్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
