
DNews : Dec 01: నారాయణపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వ ఏర్పాటుకు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మక్తల్లో విజయర్యాలీని మొదటిసారిగా జరపడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ రోజు (సోమవారం) ఆయన మక్తల్ నియోజకవర్గాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏకీకృత మహబూబ్నగర్ జిల్లా నిర్లక్ష్యం పాలైందని, కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలనలో ఆ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే, మాజీ మంత్రి కేటీఆర్ మరియు ఆయన అనుచరులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి తమపైకి పంపుతున్నారని విమర్శించారు. పేదలకు రేషన్ అందజేస్తున్నామని, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాలమూరు జిల్లాను రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా మార్చేందుకు కావలసినన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి పేద పిల్లవాడికి విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా పాఠశాలలను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
