
DNews: Apr17: హైదరాబాద్ మెట్రో స్టేషన్లోని ప్రయాణికులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. మెట్రో స్టేషన్లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు తనిఖీలు నిర్వహించారు. రెండు ప్లాట్ఫారాలకు ఇరువైపులా సోదాలు నిర్వహించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే, బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిపై పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
