
DNews: July06: దేశంలోని కోట్లాది మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టెలికాం కంపెనీలు త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశాలు ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా ప్రకారం, రాబోయే 3 నుంచి 4 నెలల్లో మొబైల్ టారిఫ్లు 12 నుంచి 15 శాతం వరకు పెరగవచ్చు.
టెలికాం రంగంలో పోటీ గతంతో పోలిస్తే తగ్గిపోవడం, 5జీ సేవల విస్తరణ కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. 5జీ నెట్వర్క్ నిర్మాణంపై చేసిన భారీ వ్యయాన్ని తిరిగి రాబట్టేందుకు టెలికాం సంస్థలు రీఛార్జ్ ఛార్జీలను పెంచే అవకాశం ఉందనే అంచనాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. తాజాగా సెంట్రమ్ నివేదిక కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఇక దేశీయ టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో ఈ రెండు కంపెనీలు ముందంజలో ఉన్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా కొత్త కస్టమర్లను చేర్చుకుంటున్నప్పటికీ, జియో, ఎయిర్టెల్తో పోలిస్తే ఆ వృద్ధి చాలా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే రిలయన్స్ జియోకు సగటున 70 లక్షల మంది కొత్త చందాదారులు చేరే అవకాశం ఉందని, భారతీ ఎయిర్టెల్కు సుమారు 50 లక్షల మంది కొత్త వినియోగదారులు జతకావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో వొడాఫోన్ ఐడియాకు సుమారు 2 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు మాత్రమే చేరే అవకాశముందని నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో జియో, ఎయిర్టెల్ సంస్థలు 5జీ సేవలను అందిస్తున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా దాదాపు 100 నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. వినియోగదారులు క్రమంగా 2జీ నుంచి 4జీ, 5జీ నెట్వర్క్లకు మారుతుండటం, అలాగే పోస్టుపెయిడ్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో టెలికాం కంపెనీల సగటు వినియోగదారుడి ఆదాయం (ARPU) కూడా మెరుగుపడుతుందని నివేదిక తెలిపింది.
జూన్ త్రైమాసికంలో ARPU మరో 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అదే సమయంలో 4జీ, 5జీ వినియోగం మరింత పెరగడంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది.
