
D News: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి ‘కాంప్రమైజ్ పాలిటిక్స్’ చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజలను నిరాశకు గురిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్, BRSలది కాంప్రమైజ్ పాలిటిక్స్
‘నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా’ అన్న చందంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇరు పార్టీలు రాజకీయ డ్రామాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
స్పీకర్పై వ్యాఖ్యలను ఖండించిన బండి
స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ నేతలు అనుచిత పదజాలం ఉపయోగించడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేరని బండి సంజయ్ అన్నారు. తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
22A సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ
రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. అదే సమయంలో భూవ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రులు, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు.
విద్యార్థులు, రైతులు, ఉద్యోగుల సమస్యలపై ఫైర్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సర్టిఫికెట్ల సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. సాగునీరు, ఉద్యోగాలు, డీఏలు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలి
ఆరు గ్యారెంటీల అమలుపై స్పష్టత లేదని బండి సంజయ్ విమర్శించారు. ఒకే అంశంపై రెండు రోజుల పాటు చర్చించి విలువైన సభా సమయాన్ని వృథా చేయకుండా ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని ఆయన సూచించారు.
