
DNews: Nov 22: కరీంనగర్లో జరిగిన ఈ ఘటన హృదయవిదారకంగా మారింది. తల్లి ప్రేమ అనేది అపారమైనది, సంతానం పుట్టిన తర్వాత తల్లి అనుభవించే ఆనందం వర్ణనాతీతం. అయితే ఇటీవలి కాలంలో శిశువుల విక్రయాలు పెరుగుతున్నాయి. కొన్ని మహిళలు అక్రమ సంబంధాల ద్వారా పుట్టిన పిల్లలను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా, మరికొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలను పోషించలేక అమ్మే పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె తన ప్రియుడిని ప్రేమించి గర్భవతి అయ్యింది. కానీ ప్రియుడు మోసం చేయడంతో, ఆ శిశువును ఎలా పెంచాలో తెలియక, ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ శిశువును ఆరు లక్షల రూపాయలకు అమ్మేందుకు ఒప్పందం కుదిరింది. మధ్యవర్తుల సహకారంతో ఈ ఒప్పందం జరగగా, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చకినివానిపల్లెకు చెందిన రాయమల్లు, లత దంపతులకు శిశువును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి శిశువు విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 15 మందిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
