
DNews: May 08: మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ థలసీమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యు సంబంధ వ్యాధి అని తెలిపారు. బంధువుల మధ్య వివాహాలు జరిగే సందర్భాల్లో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. యువత వివాహానికి ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. కొత్తగా పెళ్లైన జంటలు జన్యు సంబంధ వ్యాధులు మరియు ఇతర వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం థలసీమియా మరియు ఇతర జన్యు సంబంధ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 11 లక్షల మందికి సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ నిర్వహించామని, ఆ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సతో పాటు అవసరమైన మందులు అందిస్తున్నామని తెలిపారు. థలసీమియా బాధితులకు క్రమం తప్పని రక్త మార్పిడి అవసరమని, ఐరన్ కిలేషన్ థెరపీ వంటి చికిత్సలు కూడా అవసరమని చెప్పారు. తీవ్రమైన సందర్భాల్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుందని, ఈ చికిత్సల ఖర్చు కుటుంబాలకు భారమవుతుందని, అందుకే బాధితులకు అన్ని దశల్లో సహాయం అందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమం తప్పని రక్త మార్పిడి, అవసరమైన మందులు, ఆధునిక చికిత్సా సౌకర్యాలను బలోపేతం చేస్తున్నామని, హైదరాబాద్లోని నిమ్స్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో థలసీమియా బాధిత పిల్లలకు నిరంతర సేవలు అందించేందుకు డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు.
