
DNews: Apr 23: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వం తో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ రోజు నుండి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని కార్మికులు స్పష్టం చేశారు. సాధారణ సమ్మె తరహాలో పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్షాప్లలో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు డిపోల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల పేరిట మోసం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణను 30 శాతం తగ్గింపులు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు బస్సులు లేకపోవడంతో గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించాలంటే అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
