
DNews: May02: అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా విమాన ఇంధనం (ATF) ధరలను శుక్రవారం మరోసారి సవరించారు. అయితే, ఈ పెంపు దేశీయ విమానాలకు వర్తించదు. దీనివల్ల దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరల పెరుగుదల భారం నుండి ఉపశమనం లభిస్తుంది. అంతర్జాతీయ విమానాలకు మాత్రమే ATF ధరలను పెంచారు. దీని కారణంగా, విదేశాలకు ప్రయాణించే వారికి టిక్కెట్ ధరలు మరింత ఖరీదైనవిగా మారతాయి.అంతర్జాతీయ సర్వీసుల కోసం కిలోలీటరుకు ATF ధరను 1,435.31 డాలర్ల నుండి 1511.86 డాలర్లకు (రూ. 1,43,385) పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. దేశీయ విమానాలకు కిలోలీటరుకు ATF ధర రూ. 1,04,927.18 వద్ద యథాతథంగా ఉంటుంది. ‘దేశీయ విమానయాన సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి’ అని పేర్కొంటూ, ఏటీఎఫ్ ధరల రూపంలో ఉపశమనం కల్పించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వ్యాట్ను బట్టి వివిధ రాష్ట్రాల్లో ఏటీఎఫ్ ధర మారుతూ ఉంటుంది.
