
హైదరాబాద్–ముంబయి జాతీయ రహదారిలో చందానగర్–గంగారం వద్ద ఫ్లైఓవర్పై మెట్రో వయాడక్ట్ ఉండేలా డబుల్డెక్ డిజైన్ను NHAI, HMRL సంయుక్తంగా ఖరారు చేశాయి. మియాపూర్–పటాన్చెరు మెట్రో విస్తరణతో సమన్వయం చేసేందుకు ఈ నమూనాను ప్రతిపాదించారు. మరోవైపు ఎల్బీనగర్–హయత్నగర్లోనూ డబుల్డెక్ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి కోరుతున్నారు. అయితే అక్కడ మెట్రో అలైన్మెంట్ ఇప్పటికే సర్వీస్ రోడ్డు వెంట ఖరారై, DPR కేంద్రానికి చేరడంతో మార్పులు చేస్తే ఆలస్యం, వ్యయం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు, మెట్రో మౌలిక వసతులను సమన్వయంతో అభివృద్ధి చేసేందుకు మరో కీలక అడుగు పడింది. నగరం నుంచి ముంబయి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో చందానగర్–గంగారం ప్రాంతం వద్ద డబుల్డెక్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను జాతీయ రహదారుల సంస్థ (NHAI), హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (HMRL) సంయుక్తంగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మార్గంలో ఒకే కారిడార్లో రహదారి ఫ్లైఓవర్తో పాటు దాని పైన మెట్రో వయాడక్ట్ నిర్మించేలా డిజైన్ రూపొందించారు.
ప్రస్తుతం మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోరైలు విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే మార్గంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఒకే ప్రాంతంలో భవిష్యత్తులో రోడ్డు ఫ్లైఓవర్, మెట్రో మార్గాలను వేర్వేరుగా నిర్మిస్తే భూసేకరణ, స్థల లభ్యత, నిర్మాణ వ్యయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో రెండు ప్రాజెక్టులను సమన్వయం చేసి డబుల్డెక్ రూపంలో నిర్మించాలనే ఆలోచనకు ప్రాధాన్యం లభించింది.
ఫ్లైఓవర్ నిర్మించాల్సిన ప్రాంతాల్లో భవిష్యత్తులో మెట్రో విస్తరణ ఉంటే ముందుగానే డబుల్డెక్ నమూనాను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో సూచించారు. కింద రహదారి వాహనాల కోసం ఫ్లైఓవర్, దాని పైన మెట్రో వయాడక్ట్ ఉండే విధంగా ఈ నిర్మాణం ఉంటుంది. నాగ్పుర్లో ఇలాంటి డబుల్డెక్ కారిడార్ను దేశంలోనే తొలిసారిగా నిర్మించారు. ఒకే మార్గంలో రెండు రవాణా వ్యవస్థలకు స్థలం కల్పించడం ద్వారా భూసేకరణ అవసరాన్ని తగ్గించడంతో పాటు నగరాల్లో పరిమిత స్థలాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చన్నది ఈ నమూనా ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
