
DNews: Mar 09: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు సంబంధిత కీలక అంశాలను ప్రస్తావించారు. రామగుండంలో రెండో దశలో ఏర్పాటు చేయబోయే 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (PPA) చేసుకోవాలని సూచించారు. మొత్తం 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు కావలసిన బొగ్గును సమకూర్చుకునే స్వేచ్ఛ ఎన్టీపీసీకి ఇవ్వాలని కోరారు.
మొదటి దశలో 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో భాగంగా 2X800=1600 మెగావాట్ల రెండు యూనిట్లను ప్రధాని నరేంద్ర మోదీ 2023లో ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. ఈ యూనిట్లు అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రూ.12,000 కోట్ల వ్యయంతో నిర్మించబడ్డాయి. మిగిలిన 3X800=2400 మెగావాట్ల యూనిట్లను రెండో దశలో పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు తీసుకుంటోంది. రెండో దశలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 85 శాతం తెలంగాణకే సరఫరా అవుతుందని ఆయన వివరించారు.
2026 మార్చి 3న తెలంగాణలో అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, ఇది చరిత్రలోనే మొదటిసారి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వనరులను పెంచే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క ఇటీవల పవర్ సెక్టార్పై ఇచ్చిన ప్రెజెంటేషన్లో, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా గ్రిడ్ స్థిరత్వం కోసం రాష్ట్రంలో 5000–6000 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి పెంచాలని సూచించినట్లు గుర్తుచేశారు.
అలాగే 2047 నాటికి రాష్ట్రంలో ఒక లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారని, దీనికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ 2400 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో ఎన్టీపీసీకి ప్రత్యేక అనుభవం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
