
D News: Aug 24: కృత్రిమ మేధ.. ప్రస్తుతం అందరినోళ్లలోనూ నానుతున్న పదం. దాని ప్రభావం అన్ని రంగాల్లో చొచ్చుకొని వస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు సైతం ఏఐ, మెషిన్ లెర్నింగ్పైనే అత్యధికంగా ఇంటర్న్షిప్లు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2025-26) అన్ని కోర్సుల వారు కలిపి ఏకంగా 44 శాతం మంది ఏఐపైనే ఇంటర్న్షిప్ల ద్వారా ఉద్యోగ అనుభవం పొందారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది.
విద్యార్థులకు నైపుణ్యాల లేమి మన విద్యా వ్యవస్థలో ప్రధాన లోపంగా ఉందని పలు అధ్యాయనాలు చెబుతుండటంతో ఏఐసీటీఈ ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్న్షిప్ పోర్టల్ను సైతం రూపొందించింది.
ఆ 4 డొమైన్లలోనే 79 శాతం మంది..
గత విద్యా సంవత్సరం(2025-26) ఏకంగా 32.79 లక్షల మంది ఇంటర్న్షిప్లు పూర్తి చేశారు. మొత్తం 81 వేల కంపెనీల్లో 200 రంగాల్లో ఉద్యోగానుభవాన్ని పొందే వీలుంది. అయితే అందులో కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్ వర్కింగ్ అనే నాలుగు డొమైన్లలోనే 79 శాతం మంది ఇంటర్న్షిప్లు పూర్తి చేయడం గమనార్హం.
నివేదికలోని ముఖ్యాంశాలు..
ఒప్పో కంపెనీల్లో 10 వేల మందికి ఇంటర్న్షిప్లు కల్పించే అవకాశం ఉండగా.. 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 5,500 మంది శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు.
ఇంటర్న్షిప్లు పూర్తి చేసిన వారిలో అబ్బాయిలు 48 శాతం మంది ఉండగా.. అమ్మాయిలు 45 శాతం ఉన్నారు.
వీరిలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 70 శాతం, పీజీ-23 శాతం ఉండగా.. డిప్లొమా విద్యార్థులు ఏడు శాతం మంది ఉన్నారు.
ప్రముఖ కంపెనీ సిస్కోలో 10 రంగాల్లో 1.90 లక్షలకుపైగా ఇంటర్న్షిప్లు అందుబాటులో ఉండగా.. 3.35 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 67,323 మంది శిక్షణ పూర్తి చేశారు.
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన సర్వీస్ నౌలో 1.10 లక్షలకుపైగా ఆఫర్లు ఉండగా.. 53,736 మంది దరఖాస్తు చేశారు. వారిలో 47,300 మంది శిక్షణ పూర్తి చేశారు.
ఎడ్యునెట్ ఫౌండేషన్ ఇంటర్న్షిప్ను 95,024 మంది పూర్తి చేశారు. అందులో 52 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు.
