
DNews: Mar 11: జాహీరాబాద్ (సంగారెడ్డి) పరిసర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఎర్రరాయి, మట్టి తవ్వకాలు ప్రకృతిని తీవ్రంగా నాశనం చేస్తున్నాయి. లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లలో రాత్రి పూట మట్టి తరలింపు, పగలు ఎర్రరాయి రవాణా నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసే రోజుల్లో ఈ అక్రమ తవ్వకాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, న్యామ్తాబాద్, కల్బేమల్, హడ్నూర్, గణేశ్పూర్, కాశింపూర్, అనేగుంట, హోటి (కె), చిన్న హైదరాబాద్, చున్నంబట్టి తండా, పరవతాపూర్, మిర్జంపల్లి, జడిమల్కాపూర్, పడియాల్ తండా, ఉప్పర్పల్లి, మన్నాపూర్, విట్టునాయక్ తండా, శేఖాపూర్, పిచేర్యగాడి, వెంకటాపూర్, బడంపేట్ వంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. రైతుల భూములను లీజ్కు తీసుకుని 50–100 అడుగుల లోతైన గుంతలు తవ్వి రాళ్లను ఒక్కొక్కటి రూ.15–20కి అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ గుంతలు వర్షాకాలంలో నీటితో నిండిపోవడంతో గొర్రెల కాపరులు, పశువులను మేపే వారు ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. హోటి, దిదిగీ పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇటుక భట్టీలు కూడా ఏర్పడి పరిస్థితిని మరింత విషమం చేస్తున్నాయి. అధికారులు రాత్రిపూట దాడులు చేయడం ప్రమాదకరమని వెనుకంజ వేస్తుండగా, అక్రమ తవ్వకాలు నిరంతరం కొనసాగుతున్నాయి.
ప్రకృతి సంపదను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎర్రరాయి తవ్వకాలు, ఇటుక భట్టీలు, మట్టి రవాణా వంటి అంశాలను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
