
DNews: Dec 06: ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడే ఇంతగా చలి ఉంటే రాబోయే జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత పదిహేనురోజులుగా జిల్లాలో వాతావరణంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా రాత్రివేళల్లో మాత్రం తీవ్రమైన చలి అనుభవిస్తున్నారు. శుక్రవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ రూరల్ పిప్పలధారిలో 11.1, తలమడుగులో 11.2, బెల మండలంలోని చాప్రాలో 11.7, మావల మండలంలో 11.8, గడిగూడలోని కరికెలో 12.0, తమ్సిలో 12.3, ఇండ్రవెల్లిలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దూర ప్రాంత గిరిజన గ్రామాలను ఘనమైన పొగమంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వెచ్చని బట్టలు ధరించి, చలి తీవ్రతను తట్టుకోవడానికి మంటలు వేసుకుని వేడెక్కుతున్నారు.
