
DNews: May 07: కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ఆఫీస్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపించారు. దీంతో బండి సంజయ్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కమలాకర్ క్యాంప్ఆఫీస్పై దాడి చేసి కిటికీలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి కారు కూడా ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. జాగిత్యాల రహదారిని పోలీసులు మూసివేసి వాహనాలను మళ్లించారు. కమలాకర్ క్యాంప్ఆఫీస్ ముందు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇక సిరిసిల్లలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటనకు బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కేటీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పింక్ కార్యకర్తలు ఆయన పర్యటనను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. సిరిసిల్లలో కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
👉 కరీంనగర్, సిరిసిల్లలో బండి సంజయ్ వ్యాఖ్యలతో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి, రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
