
DNews: Mar 14: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి, రాష్ట్ర మంత్రి సీతక్కతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి కింద మహిళలు, బాలికల కోసం ఇన్క్లూజివ్ సిటీస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఈ ప్రోగ్రామ్లో ఎంపిక చేశారు. తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆమె కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాకు నిర్భయ నిధి కింద రూ.10 కోట్లు విడుదల చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో చిన్నారుల సంరక్షణ కోసం ఆంగన్వాడీ కేంద్రాల్లో క్రెచ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం క్రెచ్ సెంటర్ సిబ్బందికి కేవలం రూ.5,000 మాత్రమే వేతనం ఇస్తున్నందున సిబ్బంది కొరత ఏర్పడిందని, వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి క్రెచ్ సెంటర్లు అత్యంత అవసరమని సీతక్క వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1,000 క్రెచ్ సెంటర్లు పనిచేస్తున్నాయని, తక్కువ వేతనాల కారణంగా సిబ్బంది కొరత ఉందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో 15,000 ఆంగన్వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. అలాగే, నరేగా నిధులతో 2,000 ఆంగన్వాడీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, ఆంగన్వాడీ మౌలిక వసతుల కోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారని వివరించారు.
ఆంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు త్వరలో పాలు, అల్పాహారం అందించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పదవీ విరమణ చేసిన ఆంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షల వరకు లాభాలు అందిస్తున్నామని తెలిపారు. ఆంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచడం అవసరమని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
