
DNews: Mar 11: సంగారెడ్డి లో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రసంగించారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక చిన్నారులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి బాధ కలుగుతోందని, యుద్ధం త్వరగా ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని దేవుని ప్రార్థిస్తున్నానని అన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు, తెలంగాణ వాసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. యుద్ధ సమయంలో అవసరమైన వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.
అలాగే, ముస్లిం సమాజానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఇమామ్లు, మౌజాన్లకు ఇవ్వాల్సిన నెలవారీ భత్యాన్ని తప్పించారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రూ. 5 వేల సహాయం అందించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేల ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
