
DNews: Feb 14: హైదరాబాద్ నగరంలో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే “రెట్రో ఫిట్మెంట్” సాంకేతికతపై దృష్టి పెట్టింది. 2023లో ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చి, ప్రస్తుతం అది విజయవంతంగా ఉప్పల్ డిపో పరిధిలో నడుస్తోంది. RTC మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగి రెడ్డి మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ RTC రికార్డు సాధించిందని తెలిపారు.

శుక్రవారం బస్ భవన్లో RTC సీనియర్ అధికారులతో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, రెట్రో-ఫిట్మెంట్ విధానంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 నాటికి గ్రేటర్ ORR పరిధిలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, విజయపుష్ప, అలాగే సాయు గ్రీన్ మొబిలిటీ, కల్యాణి మరియు పవర్ ట్రైన్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు
