
DNews: Feb 18: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆయనను అరెస్ట్ చేస్తారనే సమాచారం రావడంతో వందలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామిపై తీవ్రంగా నినాదాలు వినిపించాయి. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం వాయిదా పడింది. ఆ సందర్భంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ బుధవారం క్యాతనపల్లిలో బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మంగళవారం దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారం ఫిర్యాదు చేస్తూ, ఎస్ఐ మరియు కానిస్టేబుల్పై దాడి జరిగిందని, పోలీసు విధులను అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో బల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ను చెన్నూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నేతలను అరెస్ట్ చేయడానికి పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్-సీపీఐ కూటమి ఏర్పడి 14 మంది సభ్యులతో అధికారాన్ని సాధించింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ ఎక్స్-ఆఫిషియో సభ్యులుగా నమోదు కావడంతో పాటు స్వతంత్ర అభ్యర్థిని కూడా తమవైపు తిప్పుకోవడంతో కాంగ్రెస్ బలం 10కి పరిమితమైంది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం అధికారులు 10 నిమిషాల విరామం ప్రకటించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు బీఆర్ఎస్ నేతలతో మాట్లాడటానికి వెళ్లడం ఘర్షణలకు దారితీసింది. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్పై కేసు నమోదు చేయబడింది.
