
DNews: Mar 07: హైదరాబాద్లో జేఎన్టీయూలో జరిగిన స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవం జరపడం మాత్రమే బాధ్యత ముగిసినట్లుకాదు, సమాజం మొత్తం మహిళల రక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. మహిళలను శక్తితో పోలుస్తూ, కుటుంబ గౌరవాన్ని కూడా మహిళలతోనే పోల్చారు. నగరాలు, కళాశాలలు, ప్రజా స్థలాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారని, మనం మనలో మార్పు తెచ్చుకుని మహిళల పట్ల బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం మాత్రమే సరిపోదని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ration కార్డులు, ఇళ్ల కేటాయింపులు మహిళల పేర్లలోనే జరుగుతున్నాయని, స్వయం సహాయక సంఘాలకు సౌరశక్తి ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం కల్పించామని తెలిపారు. దీంతో మహిళలు అదానీ, అంబానీ స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ చేసే అవకాశం పొందారని అన్నారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, జిల్లాల్లో ప్రభుత్వ భూముల కేటాయింపు, పెట్రోల్ బంకులు నడిపే అవకాశాలు కల్పించడం వంటి చర్యలను వివరించారు. దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని వీరనారి చకలి ఐలమ్మ పేరుతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి సహా కీలక పదవుల్లో మహిళలకు అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వమిదేనని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందని, అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని ఉదాహరించారు. ఉద్యోగ అవకాశాలను ధైర్యంగా వినియోగించుకోవాలని మహిళలకు సూచించారు. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే సమాజం ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని, కళాశాలలు, బస్ స్టాండ్లలో జరిగే వేధింపులను నిర్లక్ష్యం చేయడం నేరాన్ని ప్రోత్సహించడమేనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని, మహిళలపై మోర్ఫింగ్, నకిలీ వీడియోలు వంటి నేరాలకు కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
