
DNews: Jan 30: హైదరాబాద్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అర్హత రద్దు పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేము ఇచ్చిన నోటీసులపై విచారణకు స్పీకర్ దానం నాగేందర్ను సమన్లు జారీ చేశారు. ఆయనను సస్పెండ్ చేస్తారని మేము నమ్ముతున్నాం” అని అన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన విషయం పెద్ద సాక్ష్యం అని ఆయన ప్రశ్నించారు. దానం పోటీ చేసిన పత్రాలు, ఆయనకు వచ్చిన ఓట్లు తదితర ఆధారాలను స్పీకర్కు సమర్పిస్తామని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ దానం నాగేందర్పై అర్హత రద్దు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12:00 గంటలకు ఎలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఉంటుంది. ఈ సందర్భంగా దానం నాగేందర్ తరఫున న్యాయవాదులు ఇద్దరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్కు కౌంటర్ అఫిడవిట్ సమర్పించారు. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ నుంచి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
