
DET:OCT 07:
నిశ్చితార్థం తర్వాత ప్రమాదం:
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ఇటీవలే నటి రష్మిక మందన్నతో ఆయనకు నిశ్చితార్థం జరిగిందనే వార్తలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రైవేట్ వేడుక అక్టోబర్ 3న హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. ఈ నిశ్చితార్థం వార్తల తర్వాత, అక్టోబర్ 6వ తేదీన సోమవారం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి వద్ద విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది.
ఘటనా స్థలంలో ఏం జరిగింది?
విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని సందర్శించి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉండవల్లి దగ్గర, విజయ్ దేవరకొండ కారు ముందు వెళ్తున్న ఒక బొలెరో వాహనం ఒక్కసారిగా కుడివైపుకు మలుపు తిరిగింది. ఈ అకస్మాత్తు మలుపు కారణంగా, విజయ్ ప్రయాణిస్తున్న లెక్సస్ కారు ఆ బొలెరో వాహనం ఎడమ వైపు భాగాన్ని ఢీకొట్టింది.
ఎలాంటి గాయాలు కాలేదు:
ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. నటుడు క్షేమంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ మరొక వాహనంలో హైదరాబాద్కు ప్రయాణం అయ్యారు. ఆయన టీం మాత్రం భీమా ఇన్సూరెన్స్ అవసరాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ లగ్జరీ కారు ముందు భాగం కొద్దిగా దెబ్బతింది.
విజయ్ దేవరకొండ స్పందన:
ప్రమాదం గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, విజయ్ దేవరకొండ స్వయంగా అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. “అంతా బాగానే ఉంది. కారుకు దెబ్బ తగిలింది, కానీ మేమందరం క్షేమంగా ఉన్నాం. నేను వర్కౌట్ కూడా చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. తల కొంచెం నొప్పిగా ఉంది, కానీ నిద్రతో అది కూడా పోతుంది. మీరు ఈ వార్త చూసి కంగారు పడకండి. మీ అందరికీ నా ప్రేమ, కౌగిలింతలు” అని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆయన అభిమానులు ఈ విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
