
ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో CII–ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్–2026’కు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయడం కంటే అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆదా చేసే ప్రతి యూనిట్ మరింత చౌకైనదని అన్నారు.
ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశంగా చూడకూడదని అది ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహమని భట్టి తెలిపారు. మెరుగైన మోటార్లు, సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించి వృథాను అరికట్టాలని సూచించారు.
ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గడం వల్ల విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని, పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు అధిక మొత్తంలో విద్యుత్ అవసరం కానుందని వివరించారు.
పీక్ డిమాండ్ను నియంత్రించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గించవచ్చని అన్నారు. ఇంధన పొదుపు దేశానికి మరింత ఇంధన భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు.
