
22ఏ భూముల సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. అసెంబ్లీ వద్ద విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నేతల భూదందాలకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెడతామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేశారని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూబకాసురులు తాము కాదని గత పదేళ్లలో అధికారంలో ఉన్న నాయకులే భూములను దోచుకున్నారని ఆరోపించారు. 22ఏ భూముల విషయంలో విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.
22ఏ జాబితాలో కోటి 16 లక్షల ఎకరాల భూమి ఉందన్న ప్రచారం అవాస్తవమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా జరిగిన తప్పిదాల కారణంగానే అనేక భూములు నిషేధిత జాబితాలో చేరాయని వివరించారు.
