
D Spiritual: Sept 2: గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు
రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పుష్కరాల ఏర్పాట్ల కోసం పంచాయతీరాజ్ శాఖ తరఫున అదనంగా రూ.100 కోట్ల నిధులను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ అదనపు నిధులను ముఖ్యంగా బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాలకు విడుదల చేశారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నూతన రహదారుల నిర్మాణం, ఇప్పటికే ఉన్న రహదారుల మరమ్మతులు చేపట్టనున్నారు. అలాగే భక్తుల కోసం స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలను కూడా మెరుగుపరచనున్నారు.
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణ
గోదావరి పుష్కరాల ప్రాంగణాలు, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేటాయించిన రూ.100 కోట్ల నిధులను పోలవరం, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
గోదావరి నదీ జలాల పవిత్రతను కాపాడటంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పారిశుధ్య నిర్వహణ, ఘాట్ల విస్తరణ వంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
