
D-News: తెలంగాణలో ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలకు చెందిన హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, మెడికల్ విద్యార్థుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. స్టైపెండ్ పెంచాలని, గతంలో అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఐదు ప్రభుత్వ ఆయుష్ మెడికల్ కాలేజీలకు చెందిన వైద్య విద్యార్థులు సికింద్రాబాద్లోని ఆయుష్ కమిషనరేట్ ఎదుట నిరసన చేపడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమపై కూడా ఇతర వైద్య విభాగాల విద్యార్థులతో సమానంగా పని భారం ఉంటుందని, అయితే తమకు మాత్రం తక్కువ స్టైపెండ్ అందుతోందని ఆయుష్ విద్యార్థులు చెబుతున్నారు. స్టైపెండ్ పెంపుపై పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం లభించలేదని వారు ఆరోపిస్తున్నారు.
స్టైపెండ్ పెంపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేస్తుందని గతంలో అధికారులు హామీ ఇచ్చినట్లు JAC తెలిపింది. అయితే ఆ జీవో విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, హామీ అమలు అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
తెలంగాణ ఆయుష్ JAC వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ.. తమ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని అన్నారు. ఆయుష్ వైద్య విద్య, వైద్య సేవలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే భావన తమలో ఏర్పడుతోందని పేర్కొన్నారు.
స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేయాలని, తమ ఆందోళనకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని ఆయుష్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు.
