
D News: Aug 25: UPSC సివిల్స్ వంటి కఠినమైన పరీక్షలో గంటల కొద్దీ చదవడం మాత్రమే విజయానికి సరిపోదు. అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నామన్నదే అసలు విషయం. క్రమశిక్షణ, పక్కా ప్లానింగ్, నిరంతర రివిజన్, చేసిన తప్పులను విశ్లేషించుకోవడం.. ఇవన్నీ సివిల్స్ ప్రిపరేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంజినీరింగ్ నేపథ్యం నుంచి వచ్చి UPSC సివిల్స్లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్ అభ్యర్థి సాయి శివాని తన ప్రిపరేషన్ విధానాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
సివిల్స్కు సిద్ధమయ్యే అభ్యర్థులకు చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన రోజువారీ రొటీన్, సరైన ప్లానింగ్, తప్పుల నుంచి నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని సాయి శివాని తెలిపారు. తన ప్రిపరేషన్లో పాటించిన టైమ్టేబుల్, చదువు విధానం, మొదటి ప్రయత్నంలో ఎదురైన నిరాశను అధిగమించిన తీరు గురించి ఆమె వివరించారు.
రోజూ ఉదయం 5 గంటలకే లేవడం
చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన రొటీన్ను పాటించడం తనకు అలవాటని సాయి శివాని చెప్పారు. ప్రతిరోజూ నిద్రపోయే సమయం, నిద్రలేచే సమయం ఒకేలా ఉండేలా చూసుకునేవారట. బర్త్డే అయినా, ఆదివారం అయినా, పండుగైనా.. ఉదయం 5 గంటలకు లేవడం మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదని తెలిపారు.
ఉదయం లేచిన వెంటనే ముందురోజు చదివిన అంశాలను రివిజన్ చేసేవారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి యోగా, మెడిటేషన్కు కొంత సమయం కేటాయించేవారు. చదువును ఒకేసారి గంటల తరబడి కాకుండా పలు స్టడీ స్లాట్లుగా విభజించుకుని చదివేవారు. సాధారణంగా రోజుకు 3 నుంచి 4 స్టడీ స్లాట్లు ఉండేవని, ఒక్కో స్లాట్ సుమారు 2.5 నుంచి 3 గంటల పాటు కొనసాగేదని చెప్పారు.
చదువుతో పాటు మధ్యలో అవసరమైన బ్రేక్లు తీసుకునేవారు. మధ్యాహ్నం సుమారు అరగంట పాటు నిద్రపోయేవారు. సాయంత్రం కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి ముఖ్యమైన వార్తలు, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలను కవర్ చేసేవారు. రాత్రి 10:30 గంటలకల్లా చదువు ముగించి నిద్రపోయేలా తన రొటీన్ను కొనసాగించినట్లు సాయి శివాని తెలిపారు.
సాధారణంగా రోజుకు 6 నుంచి 8 గంటల చదువు
ప్రిపరేషన్ సమయంలో సాధారణంగా రోజుకు 6 నుంచి 8 గంటలు చదివేవారని సాయి శివాని వెల్లడించారు. చదువుతో పాటు పుస్తకాలు చదవడం, పెయింటింగ్, యోగా వంటి తనకు ఇష్టమైన హాబీలకు కూడా కొంత సమయం కేటాయించేవారు. అయితే పరీక్షలు దగ్గరపడే కొద్దీ చదివే సమయాన్ని క్రమంగా పెంచేవారు.
ముఖ్యంగా UPSC మెయిన్స్ సమయంలో ప్రిపరేషన్ మరింత తీవ్రంగా సాగిందని తెలిపారు. పరీక్ష డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో రోజుకు 14 నుంచి 15 గంటల వరకు కూడా చదివినట్లు చెప్పారు. అయితే ఎక్కువ గంటలు చదవడం కంటే, చదివిన సమయంలో పూర్తి ఏకాగ్రతతో ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు.
డైలీ ప్లానర్ ఎంతో కీలకం
తన UPSC ప్రిపరేషన్లో డైలీ ప్లానర్ చాలా కీలకంగా పనిచేసిందని సాయి శివాని తెలిపారు. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు మరుసటి రోజు ఏయే టాపిక్స్ పూర్తి చేయాలి? ఎలాంటి టార్గెట్లను చేరుకోవాలి? అనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకునేవారు.
రోజువారీ లక్ష్యాలతో పాటు వారానికి ఏం పూర్తి చేయాలి? వచ్చే నెలలో ఏయే అంశాలను కవర్ చేయాలి? అనే దానిపైనా స్పష్టమైన టార్గెట్లు పెట్టుకునేవారు. ఇలా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకోవడం వల్ల ప్రిపరేషన్ మరింత పద్ధతిగా సాగేదని చెప్పారు.
తాను నిర్దేశించుకున్న టార్గెట్లను కాగితంపై రాసుకుని గోడకు అంటించేవారు. ప్రతిరోజూ వాటిని చూసుకోవడం ద్వారా ప్రిపరేషన్ ఎక్కడ ఉంది? ఇంకా ఏం పూర్తి చేయాలి? అనే విషయాలపై స్పష్టత ఉండేదని సాయి శివాని వివరించారు.
