
D Spiritual: Aug 13: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. తిరుపతి రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో ప్రత్యేక వీక్లీ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలు సర్వీసులకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతికి వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు, వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వీక్లీ స్పెషల్ రైలు
తిరుపతి-విశాఖపట్నం మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ (08509)ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైలు ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతి ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
అదేవిధంగా విశాఖపట్నం-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ (08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు నడవనుంది. ప్రతి సోమవారం, శుక్రవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్లు అందుబాటులో ఉంటాయి.
ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ సూచించింది. మరోవైపు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇతర ప్రత్యేక రైళ్లు
సంబల్పూర్-చర్లపల్లి (08309) ప్రత్యేక రైలు ఆగస్ట్ 14న ఉదయం 11.45 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి.. ఆగస్ట్ 15న ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలులో మొత్తం 20 కోచ్లు అందుబాటులో ఉంటాయి.
అటు తమిళనాడులో ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చి వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు తదితర స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాప్లు ఉంటాయి.
