
రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థి ఉద్యమం తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఆ పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉన్నారు. మరోవైపు, హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు భారత్ను కోరినప్పటికీ ఈ అంశంపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
హసీనా అప్పగింత అంశం భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై కూడా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో భారత్కు చెందిన దౌత్యవేత్త బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిక్ రెహమాన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగిన ఈ భేటీలో షేక్ హసీనా అప్పగింత అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్తో భారత హైకమిషనర్ దినేష్ త్రివేది సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీ సానుకూల వాతావరణంలో జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇందులో మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం తెలిపింది.
భారత్, బంగ్లాదేశ్ దేశాలు సానుకూల, నిర్మాణాత్మక, భవిష్యత్ దృష్టితో కూడిన విధానంలో కలిసి పనిచేయాలనే ఉద్దేశాన్ని ప్రధాని తారిక్ రెహమాన్కు దినేష్ త్రివేది తెలియజేసినట్లు భారత హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై కూడా ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది.
భారత్–బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేసే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు భారత హైకమిషన్ తెలిపింది. ప్రధాని తారిక్ రెహమాన్తో భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు త్రివేది ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు.
“మా మధ్య మంచి చర్చ జరిగింది. ఇరు దేశాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ప్రజల ఆకాంక్ష మాత్రం ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలే. చర్చల ద్వారా పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని నేను భావిస్తున్నాను” అని త్రివేది పేర్కొన్నారు.
అదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్పై త్రివేది ప్రశంసలు కురిపించారు. ఆయనను వినయపూర్వకంగా, సామాన్య ప్రజలతో మమేకమయ్యే నాయకుడిగా అభివర్ణించారు.
