
D News: Aug 5: తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే కేంద్రాల్లో ఒకటి. ఈ కీలక స్టేషన్ను రూ.714.73 కోట్ల వ్యయంతో విమానాశ్రయం తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో దాదాపు 65 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు.
పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ఆధునిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రెండు అంతస్తులతో కూడిన విశాలమైన ఎయిర్ కాంకోర్స్, ఆకర్షణీయమైన రూఫ్టాప్ నిర్మాణాలు ఈ స్టేషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తుండగా, ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, ట్రావలేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే మెట్రో రైలు సేవలతో సులభ అనుసంధానం కోసం ప్రత్యేక స్కైవాక్లను కూడా నిర్మిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టులో పలు హరిత చర్యలను అమలు చేస్తున్నారు. విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మురుగునీటి శుద్ధి కోసం ఆధునిక ఎస్టీపీ ప్లాంట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ సమగ్ర అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రపంచ స్థాయి రైల్వే కేంద్రంగా మారనుంది.
