
D News: Aug 1: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం బ్యారేజీతో పాటు తెలంగాణలోని భద్రాచలం వద్ద వరద నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండటంతో మొత్తం 175 గేట్లను ఎత్తివేసి, వచ్చిన నీటిని దిగువన సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరగా, సుమారు 7.30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రత మరింత పెరిగింది. అక్కడ నీటిమట్టం 54.8 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం దాదాపు 14.26 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఉధృత ప్రవాహంతో స్నాన ఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. అలాగే చర్లలోని తూరుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రాజమహేంద్రవరం, కోనసీమ ప్రాంతాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు లంక గ్రామాలకు వెళ్లే తాత్కాలిక మార్గాలు తెగిపోయాయి. దీంతో లంక గ్రామాల ప్రజలు మరపడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 17 మండలాలకు చెందిన 32 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో జిల్లా కలెక్టర్ అధికారుల సెలవులను రద్దు చేశారు. అలాగే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
