
D News: Jul 13: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. నిర్మాణ పనులపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూలో పరిశీలించారు. స్పిల్వే వద్ద గోదావరి వరద ప్రవాహంతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.
హెలికాప్టర్ పర్యటన అనంతరం సీఎం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం (ECRF)లోని గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మాణ దశలో ఉన్న జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, వరదల మధ్య పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులు మ్యాప్ల ద్వారా వివరించారు.
ఈ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఈఎన్సీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, వరదల సమయంలోనే సీఎం స్వయంగా ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
